20240316 163039

ఒకే రోజు 30 ప్రోగ్రామ్స్​.. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి సుడిగాలి పర్యటన

Spread the love

కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మంట్ల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 20 డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. 
తాగునీటి అవసరాలు తీర్చేలా..
వేసవి సమీపిస్తున్న వేళ ఆయా డివిజన్ల పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కిషన్​ రెడ్డి కృషి చేశారు. తన ఎంపీ ల్యాడ్స్​ తోపాటు సీఎస్​ఆర్, కేంద్ర ప్రభుత్వ నిధులతో పవర్​ బోర్లు, వాటర్​ లైన్లు ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని డివిజన్లలో సిటిజన్స్​ రోజూ వ్యాయామం చేసేందుకు ఓపెన్​ జిమ్​ లు ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఆయా డివిజన్లలో నిర్మించిన కమ్యూనిటీ హాల్స్​ ఓపెన్​ చేశారు. ఒకే రోజు దాదాపు 30కి పైగా ప్రోగ్రామ్స్​ కు హాజరై ప్రారంభోత్సవాలు చేశారు. 
తాగునీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
వేసవి సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని ప్రజల తాగునీటి అవసరాలపై దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి కోరారు. ఇప్పటికే బెంగళూరులో తాగునీటికి కటకట ఎదురవుతున్న వేళ.. హైదరాబాద్​ జంట నగరాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం హైటెక్​ సిటీని అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ.. బస్తీ ప్రజల అవసరాలు తీర్చలేదని మండిపడ్డారు. కనీసం రోడ్లు, నీటి వసతి, డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారని, కాంగ్రెస్​ సర్కారైనా.. బస్తీవాసుల బాధలు తీర్చాలని డిమాండ్​ చేశారు. శుక్రవారం నాలుగు అసెంబ్లీ సెగ్మంట్ల పరిధిలో కోట్లాది రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 
క్రీడాకారులకు అభినందన..
ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జింఖాన గ్రౌండ్స్​ లో కొనసాగుతున్న సికింద్రాబాద్​ పార్లమెంట్​ మహిళా క్రీడోత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్​, అథ్లెటిక్స్​ లో పాల్గొంటున్న క్రీడాకారులను కిషన్​ రెడ్డి అభినందించారు. ​ 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *