అయోధ్య అక్షింతలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. అయోధ్య అక్షింతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని మంత్రికి కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు తెల్లవారుజామున కరీంనగర్ లోని శివాలయాన్ని ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆయన శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పొన్నం ప్రభాకర్ మంత్రి హోదాలో ఉండి.. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అంటూ ఎగతాళి చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. అక్షింతలు అంటే ఏమిటో.. వాటీ ప్రాముఖ్యత ఎందో తన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న అయోధ్య అక్షింతల గురించి తెలియకుండా అనుచిత వ్యాఖ్యలు చేయోద్దని.. రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై కాంగ్రెస్ రాజకీయం చేయడం తగదని బండి సంజయ్ అన్నారు.
హిందువుల చిరకాల వాంఛ ఈ నెల 22వ తేదీన నెరవేరబోతోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువుల సహకారం తో దివ్యమైన, భవ్యమైన రామాలయ నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలోని ఆలయాలను శుద్ది చేస్తున్నామన్నారు. అయోధ్య అక్షింతల పంపిణీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని గుర్తు చేశారు.. అక్షింతలు, రేషన్ బియ్యం అనే వారికి వాటి ప్రాముఖ్యత, పవిత్రత తెలియదన్నారు. అక్షింతల గురించి కామెంట్లు చేస్తే వారి ఇంట్లో వారే మంత్రికి అక్షింతలు వేస్తారని బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Leave a Reply